Bhagavad Gita: Chapter 7, Verse 3

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।

మనుష్యాణాం — మనుష్యులలో; సహస్రేషు — వేల మందిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; యతతి — పరిశ్రమిస్తారు; సిద్ధయే — పరిపూర్ణ సిద్ధి కొరకు; యతతామ్ — ఈ ప్రయత్నించేవారిలో; అపి — కూడా; సిద్ధానాం — పరిపూర్ణ సిద్ధి సాధించినవారిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; మాం — నన్ను; వేత్తి — తెలుసుకోనును; తత్త్వతః — యదార్థముగా.

Translation

BG 7.3: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.

Commentary

ఈ శ్లోకంలో 'సిద్ధి' అన్న పదం పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు ఇక్కడ చూడండి : అలౌకికమైన శక్తుల సంపాదన, పనిలో సాఫల్యము, విజయము, నిపుణత, నెరవేర్చుట, ఏదేని సమస్యకి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖము, మోక్షము, అసాధారణ మైన నైపుణ్యం, పరిపూర్ణత. శ్రీ కృష్ణుడు 'సిద్ధి' అన్న పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత అన్న అర్థంలో వాడుతున్నాడు, ఇంకా అంటున్నాడు, ‘అర్జునా, అసంఖ్యాకమైన ఆత్మలలో అతి కొద్ది వాటికి మాత్రమే మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధించిన ఆ జీవాత్మలలో కూడానూ, నా సర్వశ్రేష్ఠమైన స్థాయిని మరియు దివ్య మహిమలను ఎఱిఁగిన వారు చాలా అరుదు’ అని.

ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, ఎందుకు భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకోలేరు? ఇది ఎందుకంటే, భగవంతునిపై భక్తి లేకుండా ఆయన గురించి తెలుసుకోవటం కానీ, ఆయన్ని గ్రహించటం కానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగులు, లేదా ఇతర మార్గ ఆధ్యాత్మిక సాధకులు, ఆయా సాధనతో పాటుగా భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భగవద్గీతలో, ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు పదే పదే చెప్తున్నాడు:

‘ఆయన సర్వాంతర్యామి మరియు సర్వ భూతములు ఆయన యందే స్థితమై ఉన్నా సరే, ఆయన భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాడు.’ 8.22.

‘ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.’ 11.54.

‘కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.’ 18.55.

ఈ విధంగా, భక్తి రహితంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటుపడే వారు భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక అనుభవపూర్వక విజ్ఞానం లభించదు.

చాలా మంది మనుష్యులలో కొద్ది మందికి మాత్రమే తాను యదార్థముగా తెలియును అని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇక తన ప్రాకృతిక (భౌతిక) మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నాడు. మొదట 'అపరా ప్రకృతి', అంటే భౌతిక శక్తి క్షేత్రము, గురించి పరిచయం చేస్తున్నాడు; ఇది నిమ్న స్థాయి శక్తి అయినా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే.